పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, సెప్టెంబర్ 19:
బొల్లోనిపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను, శనిగారం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. వారి లెక్కల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు గణితంలోని వివిధ అంశాలపై ప్రశ్నలు వేసి, వారు సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠ్యాంశాలపై అవగాహనను పరిశీలించారు.అనంతరం పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను మరింత పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ ఆకస్మిక తనిఖీలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, నల్లబెల్లి తహసీల్దార్ కృష్ణ, సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.