ఎఫ్టీఎల్ మార్కింగ్ పూర్తి చేయాలి
శాఖల సమన్వయంతో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి
వరంగల్, హన్మకొండ
జిల్లాల
కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, చాహత్ బాజ్పాయ్
వరంగల్, సెప్టెంబర్ 18: పరివర్తన అవాజ్

వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఖిలా వరంగల్లోని గుండు చెరువు ప్రాంగణంలో వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు సంబంధించి వివిధ శాఖలతో ఏర్పాటు చేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెండు జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల విస్తీర్ణం, ప్రస్తుత పరిస్థితి, వాటి పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ఇరిగేషన్, రెవెన్యూ, కుడా, సర్వే తదితర శాఖల అధికారులతో కలెక్టర్లు సమీక్షించారు.
చెరువులు, కుంటలు, నాలాలను నోటిఫై చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నాలాకు సంబంధించిన ఫీల్డ్ రిపోర్టును ఇరిగేషన్ అధికారులు అందజేయాలని సూచించారు. చెరువులు, కుంటలకు సంబంధించి ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ జారీకి ముందు క్షేత్రస్థాయి ఫీల్డ్ రిపోర్టు ఎంతో కీలకమని తెలిపారు.
చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాకుండా క్షేత్రస్థాయిలో ఎఫ్టీఎల్ మార్కింగ్ చేపట్టాలని ఆదేశించారు. చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురికాకుండా స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేసి, వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
నాలాల కన్వర్షన్ సమయంలో సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలన నిర్వహించాలని కలెక్టర్లు ఆదేశించారు. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణలో సాగునీటిపారుదల, రెవెన్యూ, కుడా, సర్వే, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ బి. నిఖిత, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీవో సుమ, భూముల కొలతల శాఖ ఏడీ నూర్ సింగ్, సాగునీటిపారుదల శాఖ ఈఈలు మంగీలాల్, కిరణ్కుమార్, కుడా ఈఈ భీమ్రావు, సీపీఓ రవీంద్ర రాడేకర్, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.