పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 19
ధర్మసాగర్ మండలం కేశవనగర్ గ్రామం వద్ద గుర్తుతెలియని దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పరామర్శించారు.స్వయంగా ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు లక్ష్మణ్ నాయక్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యుల బృందానికి సూచించారు. అనంతరం బాధితుడు మరియు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఇటువంటి భౌతిక దాడులు హేయమైన చర్య అని మండిపడ్డారు. రాజకీయాల్లో లేదా శాంతిభద్రతల విషయంలో ఇటువంటి హింసాత్మక ఘటనలను సహించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యుల బృందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.